05-12-2024 02:16:25 AM
హుస్నాబాద్, డిసెంబర్ 4: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే తనకు మంత్రి పదవి వచ్చిందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజీగా ఉండటం వల్ల వారితో కలలేకపోతున్నానని, కానీ వారు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన హుస్నాబాద్లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గ ప్రజలను కలవలేకపోతున్నందువల్ల తన క్యాంప్ ఆఫీస్లో స్పెషల్ అపాయింట్మెంట్ కోసం వాట్సాప్ నంబర్ను ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, సరోజన తదితరులున్నారు.