బట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య నామకరణం
మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని భట్టుపెల్లి చౌరస్తాకు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ వ్యాపారి కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేస్తూ మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మాణించింది. వార్డు నెంబర్ 6, 7ల పరిధిలో ఉన్న ఈ చౌరస్తాకు తన తండ్రి గారైన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్యయ్య చౌరస్తాగా నామకరణం చేయాలని వార్డు నెం.17 కౌన్సిలర్ కావేటి విజయ్ కుమార్ కోరిన నేపథ్యంలో దీనికి నామకరణం చేస్తూ కౌన్సిల్ తీర్మాణించింది. కావేటి సమ్మయ్య విగ్రహాన్ని కూడా ఆ చౌరస్తాలో నెలకొల్పాలని పలువురు కౌన్సిలర్లు చేసిన సూచన మేరకు విగ్రహం ఏర్పాటుకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఉద్యమకారునికి అసలైన గౌరవం దక్కింది: దండె విఠల్, ఎమ్మెల్సీ
'మలి విడత తెలంగాణ ఉద్యమంలో కావేటి సమ్మయ్య గారి పాత్ర ఎనలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిర్పూరు నియోజకవర్గంలో ఆయన చేసిన ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను తెలిపాయ'ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో భట్టు పెల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా కావేటి సమ్మయ్య గారు నల్ల టీ షర్టు ధరించి అసెంబ్లీ పైకి ఎక్కి చేసిన నిరసన రాష్ట్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిందన్నారు. అటువంటి ఉద్యమకారునికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని, ప్రస్తుతం మా (కాంగ్రెస్) ప్రభుత్వం గుర్తించి ఆయనకు సముచిత గౌరవాన్ని కల్పించిందన్నారు.




