20-06-2025 10:25:26 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఈరోజు బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో పర్యటించారు. ప్రముఖ వైద్య నిపుణులు, ఎంతో మందికి వైద్య సేవలందించిన డాక్టర్ సీహెచ్. రవీందర్ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో కోరెం గ్రామంలోని రవీందర్ రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కరీంనగర్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన డాక్టర్ భూంరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భూంరెడ్డి కుమారుడితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
డాక్టర్ భూంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది పేదలకు వైద్య సాయం అందించిన డాక్టర్ భూంరెడ్డి, డాక్టర్ రవీందర్ రావుల మరణం బాధాకరమని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖులు బూర్ల దక్షిణామూర్తి మాత్రుమూర్తి ఇటీవల మరణించిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని వారి నివాసానికి వెళ్లారు. దక్షిణామూర్తిని పరామర్శించారు. అట్లాగే ఇటీవల మరణించిన కరీంనగర్ లోని గాయత్రినగర్ బీజేపీ బూత్ అధ్యక్షులు వెంకటరమణ కుటుంబాన్ని, ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డ చర్లబూత్కూర్ బీజేపీ కార్యకర్త జడ కుమార్ లను సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు.