16-10-2025 01:03:40 AM
-తడిసి ముద్దయిన సోయా బీన్ పంట
-ఆందోళన చెందుతున్న రైతులు
ఆదిలాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) :అకాల వర్షాలు అన్నదాతలు పూర్తిగా నట్టేట ముంచుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి, సోయా బీన్ పంట దెబ్బతినగా, మిగిలిన ఎంతోకొంత పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జైనథ్ మార్కెట్ యార్డులో నిలువ ఉంచిన సోయాబీన్ పంట తడిసి ముద్దయింది.
కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకముందే పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతోకొంత పండిన సోయా పంటను ఇళ్లల్లో నిల్వ ఉంచేందుకు స్థలాలు లేకపోవడంతో మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి కుప్పలు పోసి నిల్వ ఉంచారు. మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన పంటను ఎండబెట్టుకుంటున్నారు. అనుకోకుండా వర్షం కురియడంతో ఉన్నపంట మొత్తం తడిసి ముద్దవ్వడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటకుప్పలపై ప్లాస్టిక్ కవర్ లు కప్పి వర్షపు నీరును తోడేస్తు అష్టకష్టాలు పడుతున్నారు.