calender_icon.png 11 January, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవ్‌ విధ్వంసం

08-01-2026 12:40:21 AM

63 బంతుల్లోనే శతకం

చిచ్చర పిడుగు రికార్డుల వేట

భారత్ అండర్ 19 జట్టుదే గెలుపు

సౌతాఫ్రికాపై సిరీస్ క్లీన్‌స్వీప్

గత ఏడాది కాలంగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ దుమ్ము రేపుతున్న వైభవ్ సూర్యవంశీ కొత్త సంవత్సరంలోనూ చెలరేగిపోతున్నాడు. క్రీజులోకి అడుగుపెట్టడమే తరువాయి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆడుతున్నది స్వదేశంలోనూ, విదేశాల్లోనూ అనేది కూడా అనవసరం... భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికా టూర్‌లోనూ రికార్డుల మోత మోగించాడు. ఫలితంగా యూత్ వన్డే సిరీస్‌ను భారత్ అండర్ 19 జట్టు క్లీన్‌స్వీప్ చేసింది

బెనోని, జనవరి 7: ప్రపంచ క్రికెట్‌లో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఐపీఎల్ నుంచి మనోడి రికార్డుల మోత మొదలైంది. అరంగేట్రంలోనే ఐపీఎల్ లో శతక్కొట్టాడు. తర్వాత  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లోనూ దుమ్మురేపేశాడు. ఆ వెంటనే అండర్ 19 ఆసియాకప్ లో సైతం విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్ లో సౌతాఫ్రికాపై కూడా రెచ్చిపోయాడు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మూడో వన్డేలోనూ భారీస్కోర్ చేసింది.

దీనిలో వైభవ్ సూర్యవంశీదే కీ రోల్.  అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు. కేవలం 63 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డులు అందుకున్నాడు. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయస్సులో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఆయుశ్ మాత్రే గాయంతో దూరమైన నేపథ్యంలో ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా వైభవ్ ను నియమించారు.  మొత్తం 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ తో కలిసి వైభవ్ తొలి వికెట్‌కు నమోదైన 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ తొలి వన్డేలో 11 రన్స్ కే ఔటైనా రెండో మ్యాచ్ లో 68 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. 

ఈ సిరీస్ ముందు బిహార్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలోనూ  190 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. తాజా ప్రదర్శనతో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డుకు చేరువలో నిలిచాడు. అండర్ 19 వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీని దాటేందుకు కేవలం 5 పరుగుల దూరంలో నిలిచాడు. కోహ్లీ అండర్ 10 వన్డేల్లో 28 మ్యాచ్ లు ఆడి 46కు పైగా సగటుతో 978 పరుగులు చేస్తే.. వైభవ్ 18 మ్యాచ్ లలోనే 57కు పైగా సగటుతో 973 పరుగులు సాధించాడు. విశేషమేమిటంటే వైభవ్ సగటు కోహ్లీ కంటే మెరుగ్గా ఉంది. ఈ జాబితాలో విజయ్ జోల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఉండగా, యశస్వి జైస్వాల్, తన్మయ్ శ్రీవాస్తవ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీతో పాటు హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ కూడా శతకం సాధించాడు. 106 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి విధ్వంసంతో భారత్ అండర్ 19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది.

మిగిలిన బ్యాటర్లలో వేదాంత్ త్రివేది 34, అభిజ్ఞాన్ కుందు 21, ఎనాన్ 28, హెనిల్ పటేల్ 19 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా అండర్ 19 జట్టు ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కిషన్ కుమార్ సింగ్ టాపార్డన్‌ను కకావికలం చేశాడు. జోరిచ్ వాన్(1), అద్నాన్(9), లెతబో డకౌటయ్యారు. కెప్టెన్ బుల్‌బులియా(4), జాసన్ రోవెల్స్(19) పరుగులకు వెనుదిరిగారు. తర్వాత బోస్‌మన్ (40), పాల్ జేమ్స్(41 ), బోథా(36 ) కాసేపు పోరాడడంతో స్కోరు 150 దాటగలిగింది.  ఈ విజయంతో భారత్ మూడు యూత్ వన్డేల సిరీస్‌ను 3 క్లీన్‌స్వీప్ చేసింది. వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. కాగా అండర్ 19 ప్రపంచకప్‌కు ముందు అదిరిపోయే ఫామ్ కొనసాగిస్తూ భారత యువ జట్టు మెగాటోర్నీకి సిద్ధమైంది. అండర్ 19 ప్రపంచకప్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకూ జింబాబ్వే, నమీబియాల్లో జరుగుతుంది.