28-05-2025 12:41:46 AM
వన మహోత్సం కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : తెలంగాణ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంచేందుకు, పచ్చదనాన్ని మరింత విస్తరించేందుకు వనమహోత్సవరం కార్యక్రమా న్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
గత ఏడాది అనుభవాల ఆధారంగా వనమహోత్సవాన్ని మరింత పక్కగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ సూచించారు. వన మహో త్సవం కింద అటవిని పెంచేందుకు గాను జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలన్నారు.
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సారి 100 శాతం టార్గెట్ రీచ్ కావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
‘ ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాటు చేయాలి. ఇండ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, ముగన, కానుగ, తులసి, ఈత మొక్కులతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాలి.
పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువుగట్టు, ప్రభుత్వ కార్యాలయయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలి ’ అని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఎంఏయూడీ సెక్రటరీ టీకే శ్రీదేవి, ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.