శాంతించని గంగమ్మ..
5 రోజులుగా జలదిగ్బంధంలో వనదుర్గమ్మ
రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహానికి పూజలు
పాపన్నపేట,(విజయక్రాంతి): దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం, జనమే జయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ 5 రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు వదలడంతో ఆలయం చెంత గంగమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. 5 రోజులుగా గంగమ్మ శాంతించకపోవడంతో వనదుర్గమ్మ జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం చెంత ఉన్న ఏడు నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నుండి పొంగిపొర్లుతోంది.
ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి. దీంతో బుధవారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజ గోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. వచ్చిన భక్తులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యధావిధిగా పున ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు.




