కూలీలతో వెళుతున్న వాహనం బోల్తా
కొత్తగూడెం మార్చి 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు శివారు ప్రాంతంలో మంగళవారం ఉదయం కూలీలతో వెళుతున్న టాటా ఎ స్ వాహనం అదుపుతప్పి పెదవాగు లో పల్టీ కొట్టడంతో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే జూలూరుపాడు మండలం చీపురుగూడెం నుంచి గుండెపూడికి మొక్కజొన్న చేను విరిచేందుకు 20 మంది కూలీలతో టాటా ఏస్ బయలుదేరింది. బేతాళపాడు సమీపంలోని పెదవాగు వంతెన పైకి వచ్చేసరికి వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి వాగులో పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కూలీ లు తీవ్రంగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాధాలు విన్న స్థానికులు వారిని క్షేమంగా బయటకి తరలించారు. ఎండాకాలం కావడం వాగులో నీటి ప్రవాహం లేకపోవడంతో కూలీలు బతికి బయటపడ్డారు. 108 వాహనం ద్వారా కొత్తగూడెం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
క్షతగాత్రుల ఆర్తనా ధాలతో ఆసుపత్రి మారుమోగింది.వారిలో ఐదుగురి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. సోడా శేఖర్ అనే వ్యవసాయ కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టాటా ఎస్ లో 25 నుంచి 30 మంది ప్రయాణి స్తున్న ట్లు సమాచారం. క్షతగాత్రులంతా వ్యవసాయ కూలీలే. క్షత గాత్రులు,స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జూలూరుపాడు పోలీసులు కేసు నమోదు చేసి చేస్తున్నారు.






