calender_icon.png 9 November, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారు కనికరించారు..!

09-11-2025 02:17:50 PM

నూతనకల్: మండల పరిధిలోని మిర్యాల గ్రామ విద్యార్థుల భద్రతా సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. 'విజయక్రాంతి' దినపత్రికలో ఆగస్టు 5వ తేదీన ప్రచురితమైన "సారు కనికరించండి కాస్త" అనే శీర్షికతో వచ్చిన కదనానికి అధికారులు తక్షణమే స్పందించారు. ఫలితంగా, గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అత్యవసరమైన ప్రహరీ గోడ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేశారు.​ ఈ సందర్భంగా గ్రామస్తులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ​

ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల స్థలం అన్యాక్రాంతం అవుతోందని, తరగతులు జరుగుతున్న సమయంలో కూడా బయటి వ్యక్తుల రాకపోకలు, పశువుల సంచారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని 'విజయక్రాంతి' దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దినపత్రిక కథనం ప్రచురితమైన వెంటనే, ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

నవంబర్ 9 నాటికి ప్రహరీ నిర్మాణం పూర్తి కావడంతో, పాఠశాల ఆవరణ సురక్షితంగా మారింది.​ పాఠశాలకు ప్రహరీ నిర్మించడం ద్వారా విద్యార్థుల భద్రత పెరగడమే కాకుండా, పాఠశాల ఆస్తి కూడా రక్షించబడినట్లయింది. సమస్యను వెలుగులోకి తెచ్చిన విజయ క్రాంతి పత్రికకు, అలాగే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.