నగరంలో నీటి సంక్షోభం
ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. ఫలితంగా అపార్ట్మెంట్లలో బోర్లు ఎండిపోవడం, నీటి సరఫరా అంతరాయం కలగడం, ట్యాంకర్ల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో నివాసితులు నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
వేసవి డిమాండ్ దృష్ట్యా ట్యాంకర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మధ్యతరగతి కుటుంబాలపై ఇది అదనపు భారంగా మారుతోంది. నగరం కాంక్రీట్ జంగిల్గా మారడంతో భూగర్భజలాల పునరుద్ధరణ జరగడం లేదు. దీంతో ప్రతి వేసవిలో నీటి కష్టాలు తప్పడం లేదు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇక తాగునీటి నాణ్యత కూడా మరో సమస్యగా మారుతోంది---. ట్యాంకర్ నీరు శుభ్రమా, కాదా? అన్న సందేహం ప్రజలను వేధిస్తోంది.
ఈ పరిస్థితిని ఎదుర్కొవాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ముందుగా ప్రతి అపార్ట్మెంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలి. వేసవికాలం ముగిసేలోపు చెరువులు, కుంటలు శుభ్రపరిచి వర్షపు నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలి.
అలాగే నీటి వృథాను అరికట్టడానికి ప్రజలకు అవగాహన కల్పించాలి. మరోవైపు, ట్యాంకర్ వ్యవస్థపై నియంత్రణ అవసరం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకోకపోతే---భవిష్యత్తులో నీటి కోసం పోరాటం మరింత తీవ్రమవుతుంది. నీరు కేవలం అవసరం కాదు, అది జీవనాధారం. దాన్ని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎల్లబోయిన వెంకటేశ్వర్లు, 8184940814






