30-06-2025 01:47:34 AM
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జూన్ 29 (విజయ క్రాంతి): తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల అడిషన్లను కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థులు హుస్నాబాద్ కళాశాల ఆప్షన్ ఇచ్చి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 ప్రభుత్వ కాలేజీల్లో ఈ సంవత్సరం మొదటిసారి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ, ఏఐ కోర్సులు ప్రతివిభాగంలో 60 సీట్లకుగాను మొత్తం 240 సీట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో రాష్ట్రస్థాయి ర్యాంకునుబట్టి మనకు సీటు కేటాయింపు ఉంటుందని, హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు, సమీ జిల్లాల విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంకును బట్టి హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని కోరారు.
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యార్థులు కౌన్సెలింగ్లో ప్రథమ ప్రాధాన్యతగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి ఆప్షన్ ఇవ్వాలనికోరారు.