2 May, 2026 | 10:44 PM

మాదకద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకించాలి

02-05-2026 09:28 PM

- యువత మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి

- రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల, (విజయ క్రాంతి) : మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని వ్యతిరేకించి యువత మంచి భవిష్యత్తును  నిర్మించుకోవాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిపి) అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎం ఎం గార్డెన్స్ లో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్ పై అవగాహన కార్యక్రమానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు లతో కలిసి హాజరై ఆయన మాట్లాడారు.

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు నష్టాలను తెలుసుకొని సరైన మార్గంలో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే చట్టపరమైన పరిణామాలు, సామాజిక ప్రభావాలపై విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు గుర్తించినట్లయితే వారి సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం అందించడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి, సమాజంలో సన్మార్గాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయం జరిగినట్లయితే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, యువత భవిష్యత్తును కాపాడాలని తెలిపారు. అనంతరం డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను వివరించే గోడప్రతులను ఆవిష్కరించారు.