calender_icon.png 15 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి

15-08-2025 12:39:19 PM

ప్రజాస్వామ్యవాదులకు, కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పిలుపు

తిమ్మాపూర్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీశ్రేణులకు, ప్రజాప్రతినిధులకు,అధికారులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం వల్ల లభించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతమనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామిక వాదులు,  కాంగ్రెస్ పార్టీశ్రేణులు  ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంబిగించాలన్నారు. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయినట్టుగా వచ్చిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తం గా చర్చనీయాంశంగా మారాయన్నారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఫామ్ 6 బీ పేరుతో లక్షా 60వేల ఓట్ల చోరీ జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి, ఎన్నికల విశ్వసనీయతకు తూట్లు పొడిచేలా జరిగిన ఓట్ల చోరీ వ్యవహారంపై ప్రజలను జాగృతపర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ వేడుకలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, శ్రీగిరి రంగారావు, గంకిడి లక్ష్మారెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి , బండి మల్లేశం, రామిడి తిరుపతి, బక్కారెడ్డి, సాయిరి దేవయ్య, దుడ్డెల కుమార్, తాళ్ల కుమార్, ఎల్లారెడ్డి, సమద్, అంకూసు, అజయ్, డాక్టర్ లక్ష్మణ్, ఎం ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.