4 May, 2026 | 12:49 AM

ముస్లింలకు ఓబీసీ కోటాను వ్యతిరేకిస్తున్నాం

06-02-2025 01:38 AM

ముస్లింలకు ఓబీసీ కోటాను వ్యతిరేకిస్తున్నాం

హైదరాబాద్, ఫిబ్రవరి5 (విజయక్రాంతి): ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశామని.. కులాలపై సర్వే చేసిన ఏకైక రాష్ర్టంగా తెలంగాణ నిలిచిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై.. లోక్‌సభ వేదికగా బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన కులగణన రిపోర్టులో 46 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని..

మరో 10 శాతం ముస్లింలను బీసీలుగా చూపించారని పేర్కొన్నారు. కులగణనలో ముస్లింలకు ఓబీసీ హోదా కల్పించారని తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన రిజర్వేషన్ కోటాను ముస్లింలకు కేటాయిస్తుందంటూ ఆరోపించారు. రాష్ర్టంలో ముస్లింలకు ఓబీసీ హోదా కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు.

దీనిని తాము అడ్డుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నిజంగా కులగణనను అనుసరిస్తే.. ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలపై, ఓబీసీలపై ప్రేమ లేదని, కేవలం ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసమే నటిస్తారని విమర్శించారు. ఓబీసీలపై కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో తెలంగాణ మంత్రులను చూస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు.