పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు
భైంసా జులై 10 (విజయ క్రాంతి): గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచ్ ల పాత్ర కీలకమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సర్పంచ్ లకు గ్రామ పరిపాలన అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని వివరించారు. ఇందుకోసం సర్పంచ్ లు కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ అంశంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని వివరించారు. తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలన్నారు.
చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, ఆదాయ సృష్టి చేసుకోవచ్చని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అంకితభావంతో కృషి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






