11-09-2025 01:52:06 AM
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే బీసీ సభను అడ్డుకుంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. పంట పొలాలు నష్టపోయిన రైతులను నేటికీ ఆదుకోలేదని, రైతుల పట్ల సీఎం కు, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను పరామర్శించకుండా విహారయాత్రకి వచ్చి వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది అన్నారు. ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ ఇస్తార నుకుంటే పది రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు, మూడు రోజుల్లో ప్యాకేజీ ప్రకటించకపోతే బీసీ సభను నియోజకవర్గ రైతులతో కలిసి అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి లక్ష చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సంబందించిన బోర్ మోటార్లు వరదలో కొట్టుకుపోయాయని వారికి వెంటనే ప్రభుత్వం కొత్త మోటార్లు అందజేయాలని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.
బీసీ సభ పేరిట సీఎం రేవంత్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఓట్ల కోసమే బీసీ సభ పేరిట కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ముదాం సాయిలు, కపిల్ రెడ్డి, ఏగుల నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజు, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్ పాల్గొన్నారు.