ఆ భవనాన్ని కూల్చేస్తాం.. ఓనర్పై క్రిమినల్ కేసు
- యజమాని నిర్లక్ష్యం వల్లే ముగ్గురు కార్మికుల బలి
టోలీచౌకి ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి):టోలీచౌకిలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ముగ్గురు కార్మికుల ప్రాణాలు బలిగొన్న ఘటనపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని తేల్చిచెప్పిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. సదరు భవనాన్ని పూర్తిగా డిమాలిష్ చేస్తామని ప్రకటన చేశారు.
కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడిన యజమా నిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు అధికారికంగా సిఫారసు చేసినట్లు ఆయన వెల్లడించారు. నగరంలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల భద్రతను గాలికొదిలేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ముగ్గురు కార్మికుల మృతికి కారణమైన సదరు భవనాన్ని నిబంధనల ప్రకారం కూల్చివేస్తామని, యజమానిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు.
ఇదే క్రమంలో మహానగర అభివద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి కమిషనర్ కర్ణన్ వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా శానిటేషన్, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అత్యధిక ప్రాధా న్యత ఇస్తున్నామన్నారు. ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ తదితర ఇతర ప్రభుత్వ శాఖల తో సమన్వయం చేసుకుంటూ నగర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శాశ్వతంగా దూరం చేసేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వంద రోజుల లోపే నగర రూపురేఖలు మార్చేలా ఈ యాక్షన్ ప్లాన్ అమలు జరుగుతోందని వెల్లడించారు.
కాగా జీహెచ్ఎంసీ కి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను ప్రా పర్టీ ట్యాక్స్ వసూళ్లపైనా కమిషనర్ స్పందించారు. ఏళ్లుగా పేరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయిల వసూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్మెంట్ ఓటీఎస్ స్కీమ్ ప్రస్తుతం అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ పథకం కింద బకాయిలు చెల్లిస్తే వడ్డీలో ఏకంగా 90 శాతం మాఫీ అవుతుందని, కాబట్టి నగర ప్రజలు, బకాయిదారులు ఈ సదావకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుని పన్నులు చెల్లించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు.




