12-11-2025 10:04:13 PM
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్..
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఆదివాసి నాయకులు వినతిపత్రం అందజేశారు. దహేగాం మండలంలోని గేర్రే గ్రామంలో కుల దూరహంకార హత్యకు గురైన ఆదివాసి మహిళ శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్ మాట్లాడుతూ ఆదివాసీల ప్రాణాలు అంటే చులకనగా ఉందని, ఆదివాసీల ప్రాణాలకు విలువ లేదా అని జిల్లా అధికారులను ఆయన ప్రశ్నించారు.
ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ పరామర్శించకపోవడం బాధాకరమని, అన్ని కార్యక్రమాలు చేయడానికి సమయం దొరికిన, ఆదివాసి కుటుంబాన్ని పరామర్శించడానికి సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. సంఘటన జరిగి 25 రోజులు కావస్తున్న కనీసం మా కుటుంబానికి న్యాయం చేయలేకపోయారని, హత్యకు కారకులైన అందర్నీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని, హత్యలో ప్రమేయం ఉన్న శ్రావణి భర్త శేఖర్ ను కూడా అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, శ్రావణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దిగిడ బక్కన్న, జిల్లా నాయకులు సిడాo శంకర్, టేకం బాపు, మారుతి తదితరులు పాల్గొన్నారు.