16-07-2025 01:17:06 AM
-ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు చిరకాల కోరిక
-సీఎం సహకారంతో సమూల మార్పులు
-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డివిద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
నల్లగొండ టౌన్, జూలై 15 : నల్లగొండను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ ప్రజలు తనను ఆశీర్వదిస్తూ వస్తున్నారని,వారి ఉన్నతి కోసం ఎంత చేసిన తక్కువే అని మంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ పై ఆ శాఖ ఉన్నతాధికారుతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమని దాని ఖ్యాతిని పెంచేలా వీసీ, రిజిస్ట్రార్, పాలక సభ్యులు పనిచేయాలని మంత్రి సూచించారు.
యూనివర్శిటీకి ప్రత్యేకంగా రూ.60.22 కోట్ల గ్రాంట్ మంజూరు చేశామని,ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేస్తున్ననుందున కొత్త కోర్సుల పై ఆరా తీశారు. విశ్వవిద్యాలయంలో కొత్తగా ఫార్మసీ,ఎల్ ఎల్ బి,ఎల్ ఎల్ ఎం లాంటి కోర్సులు ప్రారంభించేందుకు చొరవ చూపాలని వీసీ అల్తాఫ్ హుస్సేన్ మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహకారంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు వచ్చారన్నారు.
నల్లగొండలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసి, లా కాలేజీ ఏర్పాటు చేయాలనేది నా చిరకాల కోరికనీ, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని, త్వరలో నూతన కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాలేజ్,స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో మౌళిక సదుపాయాలు, హై స్కూల్స్ బలోపేతంపై చర్చించి, అందుకు విద్యాశాఖ అధికారులు అందించాల్సిన సహకారం పై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి తో మాట్లాడి ప్రభుత్వ కాలేజీలు,స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. సమీక్షలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, సాంకేతిక,ఉన్నత విద్యా మండలి కమిషనర్ దేవసేన,మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ రవి తదితరులు పాల్గొన్నారు.