27 March, 2026 | 3:47 AM

భద్రాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

27-03-2026 01:47 AM
  1. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  2. శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్ష

భద్రాచలం, మార్చి 26 (విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. గురువారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను ఆయన పరిశీలించి, కలెక్టర్ అంకిత్ సెక్టార్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంట ర్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు వస్తున్నందున జిల్లా యంత్రాంగం సమన్వయంతో బాధ్యత లను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. స్వామివారి కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

దేవాలయ అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.