30-10-2025 06:40:26 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
కల్వకుర్తి: తుఫాన్ వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని వాటిని గుర్తించి ప్రభుత్వపరంగా రైతులను ఆదుకుంటామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మండలం వెంకటాపూర్, మార్చాల, తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. కల్వకుర్తి ప్రాంతంలో అధికంగా పత్తి, వరి పంటలను సాగు చేశారని కోతల దశలో తుఫాన్ రావడంతో భారీగా నష్టం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు.
కె ఎల్ ఐ కాల్వలోకి వర్షపు నీరు చేయడంతో నీటి ప్రవాహం ఎక్కువై గండ్లు పడ్డాయని, కొన్నిచోట్ల కాలువ మీదంగా పాడడంతో సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లి ఇళ్లలోకి నీరు చేరాయని అక్కడ కాలువలను ఎత్తు పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వెంకటాపూర్ గ్రామంలో కాలువ ఎత్తును ఐదు అడుగులు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. వర్షాలు తగ్గినా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, ఎమ్మార్వో ఇబ్రహీం, నీటిపారుదల, వ్యవసాయ శాఖ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.