పాడి రైతులకు బ్యాంకు ద్వారా రుణాల అందిస్తాం
విజయ డైరీకి పాలు అమ్మే రైతులకే మొదటి ప్రాధాన్యత
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అప్పారావు
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ గ్రామీణ బ్యాంక్(Telangana Gramin Bank) ద్వారా పాడి రైతులకు రుణాలు అందిస్తామని, ముందుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీ కి పాలు అమ్మే రైతులకు వారం రోజుల్లో రుణాలు మంజూరు చేస్తామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అప్పారావు(Telangana Gramin Bank Regional Manager Apparao) అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో విజయ డైరీ కి ప్రతిరోజు పాలు తీసుకువచ్చే రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలామంది కృత్రిమ పాలన ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కృత్రిమ పాలు వినియోగంతో ఫుడ్ ఫైజన్ సైతం అవుతున్న సంఘటనలు సైతం జరుగుతున్న విషయాన్ని రైతులకు వివరించారు. కృత్రిమ పాలు తీసుకోవడం ద్వారా షుగర్, బిపి, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో పాడి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రభుత్వ డైరీ అయిన విజయ్ డైరీ తో అనుసంధానం చేసుకున్నామని అన్నారు. విజయ్ డైరీ(Vijaya Diary)కి పాలు తీసుకువచ్చే రైతులకు లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. పార్టీ రైతులకు షెడ్లు నిర్మాణం కోసం సైతం రుణాలు మంజూరు చేస్తామని ఆర్ఎం అన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు(Dairy farmers) సద్వినియోగం చేసుకొని రైతులకు అందుబాటులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మేనేజర్లను నేరుగా కలవాలని సూచనలు చేశారు.
విజయ్ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్(Vijay Dairy Deputy Director Srinivas) మాట్లాడుతూ.. మేలు రకమైన ఆవులను కొనుగోలు చేసుకుని ప్రతిరోజు విజయ్ డైరీ కి పాలు తీసుకురావాలన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందుకు రావడం అర్చనీయమన్నారు. విజయ డైరీ ఆధ్వర్యంలో అందజేస్తున్న పాలు ఎంతో మేలు రకమైనది అని వివరించారు. రైతుల నుండి సేకరించిన పాలను మార్కెట్లో ప్రజలకు అందిస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పాడి రైతులకు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకు నుండి ఇచ్చే రుణంతో హర్యానాలో మేలు రకమైన ఆవులను కొనుగోలు చేసుకోవాలని సూచనలు చేశారు.
పాడి రైతుల విజ్ఞప్తి మేరకు ఆవులు, గేదెలకు అవసరమైన దాన కోసం తనవంతుగా అదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను కలిసి రాయితీపై దాన సరఫరా చేసే విధంగా తల వంతు కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పాడి అభివృద్ధికి జిల్లా కలెక్టర్లు రాజర్శి షా, భవేష్ మిశ్రా ప్రత్యేక కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు నుండి రుణాలు పొంది ఆవులు, గేదలు కొనుగోలు చేసుకున్న రైతులకు పశు వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా తమ వంతు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్ఎండి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తమ బ్యాంకు నుండి ఇచ్చిన రుణాన్ని విజయ డైరీ ద్వారా ప్రతి నెల ఈఎంఐ వచ్చే విధంగా ఒప్పందాన్ని చేసుకున్నామని గుర్తు చేశారు. బ్యాంకు నుండి రాయితీ లేకుండా రుణాలు అందచేస్తామని గుర్తు చేశారు. 10% వడ్డీతో రుణాలను మంజూరు చేస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని పాడి రైతులతో పాటు ఉట్నూర్ బ్యాంక్ ఆబ్ మేనేజర్ నరేష్, ఇంద్రవెల్లి, ముత్నూర్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు మధుసూదన్, మనీష్, ఇంద్రవెల్లి విజయ్ డైరీ సూపర్వైజర్ అనిల్ గాయక్వాడ్,విజయ డైరీ పాల సేకరణ కార్యకర్త రాథోడ్ ఉమేష్, ఇంద్రవెల్లి డైరీ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు శక్తి కుమార్, మున్నా బేగులు పాల్గొన్నారు.






