నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం..
అలంపూర్ జూన్,5: మానవపాడు మండల కేంద్రంతో పాటు అమరవాయి గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా గత పది రోజులుగా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కనీసం త్రాగడానికి కూడా నీరు అందక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు గ్రామాల్లో మిషన్ భగీరథ వాటర్ తనిఖీ నిమిత్తం విచ్చేసిన డీఈ రవిచంద్ర రెడ్డి, డీఈ కృష్ణకు గ్రామ ప్రజలు కలిసి సమస్యను వివరించారు.
జూరాల వద్ద ప్రస్తుతం రెండు మోటార్లు మాత్రమే నడుస్తుండగా, మూడవ మోటారును కూడా వెంటనే ప్రారంభించి గ్రామాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.ఈ సందర్భంగా స్పందించిన డీఈ రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ, జూరాల వద్ద మూడవ పంపు ప్రస్తుతం మరమ్మతుల్లో ఉందని, త్వరలోనే రిపేర్ పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడటానికి అధికార యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవపాడు సర్పంచ్ రాజేంద్రప్రసాద్, అమరవాయి సర్పంచ్ హుస్సేన్, వార్డు మెంబర్ రాజేష్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






