30-05-2025 02:13:08 AM
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
వరంగల్, మే 29 (విజయ క్రాంతి): సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల తీరు, వ్యవసాయం, వానాకాలం పంటల సాగు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం, వరంగల్ ఎయిర్ పోర్టు తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన ముగించాలని, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించే విధంగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల కొరత లేకుండా, కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాల న్నారు.
వానాకాలం సాగుకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ఇండ్లు మంజూ రు చేసిన వారందరికీ ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని ఆదేశించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టులో ఎంపికైన మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారించాలన్నారు.