09-06-2025 12:11:46 AM
మహబూబాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): ఒకప్పుడు సంక్షేమ హాస్టల్లో సీటు దొరకాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటుతో సంక్షేమ హాస్టళ్ళు సంక్షామంలో కూరుకు పోతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 23 సంక్షేమ హాస్టల్లో ఉండగా అందులో గత ఏడాది నాలుగు హాస్టల్లను మూసివేశారు. ఏడాదికి ఒకటి రెండు చొప్పున హాస్టళ్ళు మూసివేతకు గురవుతున్నాయి.
మిగిలిన 19 హాస్టల్లలో సుమారు 1,400 మంది విద్యార్థులు భోజన, వసతి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి రెండు చొప్పున విద్యార్థినీ విద్యార్థులకు బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు బాలికల కోసం ప్రత్యేకంగా మండలానికి ఒకటి చొప్పున కేజీబీవీలు ఏర్పాటు చేయడంతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.
కార్పొరేట్ స్థాయిలో నిర్వహిస్తున్న గురుకులాల్లో అక్కడే భోజనం వసతితో పాటు విద్యా బోధన చేస్తుండడంతో పిల్లల సంరక్షణ బాధ్యత కూడా చూసుకుంటుండడంతో ఐదో తరగతి నుంచి గురుకులాల్లో చేర్పించడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాథమిక విద్య చెప్పించడానికి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. బాల్యంలో పిల్లలను తమ సంరక్షణలోనే ఉంచుకొని, ప్రాథమిక విద్యను చెప్పించడానికి ప్రైవేటు పాఠశాలల వైపే ఆసక్తి చూపిస్తుండడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.
ఈ ప్రభావంతో సంక్షేమ హాస్టల్లల్లో చెరే వారి సంఖ్య కూడా క్రమేణ తగ్గుతూ వస్తోంది. ప్రాథమిక విద్యను ప్రైవేటు పాఠశాలల్లో పూర్తి చేసిన తర్వాత 5, 6 తరగతుల నుంచి ఆ పై చదువులకు ప్రభుత్వ గురుకులాల్లో చేర్పిస్తున్నారు. దీనివల్ల సంక్షేమ హాస్టళ్ల లో చేరే వారి సంఖ్య తగ్గడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
తగ్గుతున్న జనరేషన్!
గతంలో మాదిరిగా ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా, ఒక్కరిద్దరికి పరిమితం చేసి కుటుంబ నియంత్రణ పాటిస్తుండడంతో జనరేషన్ గణనీయంగా తగ్గడం కూడా ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఒక్కరిద్దరు పిల్లల్ని చక్కగా చదివించడానికి ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం, కాస్త కూస్తో ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేటు విద్యాలయాల్లో చేర్పించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరే పిల్లల సంఖ్య ఇటీవల మరింత తగ్గుతోందని చెబుతున్నారు. ఇది కూడా సంక్షేమ హాస్టల్లో సంక్షామానికి కారణంగా పేర్కొంటున్నారు.
ఈ ఏడాది మరికొన్ని హాస్టల్లకు మంగళం?
మహబూబాబాద్ జిల్లాలో 2025 26 విద్యా సంవత్సరంలో మరికొన్ని సంక్షేమ హాస్టళ్లకు మంగళం పాడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గత ఏడాది రెండు హాస్టల్లలో 10లోపే విద్యార్థుల సంఖ్య ఉండడంతో ఈ ఏడాది ఆ రెండు సంక్షేమ హాస్టల్లను కూడా మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది మూసి వేసిన జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా మారింది.
ఇక ఇనుగుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ మూసివేసి, ఎంపీడీవో కార్యాలయ నిర్వహణకు కేటాయించారు. కొన్ని హాస్టల్లలో పదిమంది కూడా ఉండకపోవడంతో హాస్టల్ల నిర్వహణ భారం పెరిగిపోవడం, వార్డెన్, వంట మనిషి, సహాయకుల వేతనాలతో పాటు విద్యుత్ ఇతర నిర్వహణ భారంతో పాటు సంక్షేమ హాస్టల్ల నిర్వహణ పట్ల ప్రభుత్వం సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి విద్యార్థుల చేరికకు అయిష్టతకు కారణంగా చెబుతున్నారు. ఫలితంగా రాబోవు రోజుల్లో సంక్షేమ హాస్టళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.