16-06-2025 12:00:00 AM
బెజ్జూర్, జూన్15 (విజయక్రాంతి): ప్రత్యేక అధికారి పాలనలో పరిశుభ్రతపై పట్టింపు కరువైందని ప్రజలు మండిపడుతున్నారు. బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి, బెజ్జూర్, ఎలుకపల్లి,సిద్ధాపూర్, పలు గ్రామాలలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉంటుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాలలో చెత్తాచెదారంతో మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ పనులు చేయించకపోవడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. దోమకాటుతో మలేరియా, డెంగ్యూ విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా గ్రామాల లో అధికారులు పర్యవేక్షణ చేపట్టి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం వెంటనే తొలగించి, బ్లీచింగ్ పిచికారి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.