మున్నేరు మహోగ్రరూపం ఎందుకిలా..
ఖమ్మం, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి ): చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం పట్టణం వరద ముంపునకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం నగరంలో విచ్చలవిడిగా జరిగిన అక్రమ నిర్మాణాలే. 1984 ప్రాంతంలో ఒక మోస్తరు వరదలు ఖమ్మం పట్టణంలోకి వచ్చాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ పట్టణం ఎంతో విస్తరించింది. నేడు 3 లక్షలకు పైగా జనాభా నగరంలో నివశిస్తున్నారు. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా మురుగుకాల్వల వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమయ్యారు. అంతేకాకుండా నగరానికి పట్టుగొమ్మల్లా ఉన్న లకారం, కొత్తగూడెం, ధ్వంసలాపురం, ఖానాపురం చెరువులను విస్మరించారు.
ఇష్టానుసారం ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇవ్వడంతో చెరువులన్నీ కుచించుకుపోయాయి. 326 ఎకరాల విస్తీర్ణంలో ఖమ్మం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు 50 ఎకరాలకు మించి లేదంటే ఎంతగా కబ్జాకు గురైందో ఇట్టే అర్థ్ధమవుతుం ది. అంతేకాకుండా లకారం చెరువుకు సంబంధించిన భూములను కొంత మంది బడాబాబులకు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం కూడా నేటి దుస్థితికి ప్రధాన కారణం. అంతేకాదు లకారం చెరువు అభివృద్ధి పేరుతో చుట్టూ పటిష్టమైన కట్టను కట్టడం వల్ల అందులోకి బయట నుంచి వచ్చే నీరు ప్రవహించే పరిస్థ్ధితి లేకుండా పోయింది. దీంతో నగరంలోని వరదంతా జనాల ఇళ్ల మీద పడడం జరు గుతుంది.
లకారం చెరువులోకి వచ్చే ప్రధాన మురుగుకాల్వలను ఎప్పుడో విస్మరించారు. దాని గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితికి దారితీసిందంటున్నారు. ఖానాపురం చెరువు కూడా ఆక్రమణకు గురైంది. అక్కడ నుంచి చైతన్యనగర్ మీదుగావచ్చే మురుగుకాల్వ కూడా ఆక్రమణ కు గురైంది. ఇప్పుడు అక్కడెక్కడా మురుగు కాల్వ కనిపించడం లేదు. పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు దర్శనమిస్తున్నాయి. వైరా రోడ్డుకు ఆనుకున్న ఉన్న మురుగు కాల్వను 60 శాతం వరకు ఆక్రమించారు. దీం తో కాల్వ కుచించికుపోయింది. నీరు పారే పరిస్థ్ధితి లేకుండా పోయింది. విచ్చలవిడి కబ్జాల వల్లనే నేడు నగరం వరదలతో అతలాకుతలమైందంటున్నారు.
అంతేకాకుండా మున్నేరుపై చాలా చోట్ల చెక్ డ్యాముల నిర్మాణం చేయడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. పురాతనకాలం నాటి గోళ్లపాడు కాల్వ కూడా అనువాళ్లు లేకుండా చేశారు. కాల్వ భూముల్లో విచ్చలవిడిగా కట్టలు కట్టి, పార్కులు నిర్మాణం చేశారు. ఫలితంగా నీరు పారే మార్గం లేక నీరంతా రోడ్లపైకి వచ్చి, చెరువులను తలపింపజేసిన పరిస్థ్ధితి ఏర్పడింది. దీనికి తోడు ఎగువున రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడం, బయ్యారంపెద్ద చెరువు అలుగుపడడం వంటి కారణాల వల్ల మున్నేరుకు భారీ ఎత్తున వరదపోటెత్తింది.
ఫలితంగా ఖమ్మం నగరంలో మురుగునీటి వ్యవస్థ్ధ సరిగా లేని కారణంగా ప్రజలుంటున్న కాలనీలపై పడింది. కాలనీలన్నీ జలమయమ య్యాయి. ఎగువన మహబూబాబా ద్, ఏటూరునాగారం ప్రాంతాల్లో 45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం వంటి అంశాలు కూడా మున్నేరుకు పెద్ద మొత్తంలో వరద పోటెత్తిందంటున్నారు. దీనికి తోడు స్వయంకృపరాధాలు, పాలకుల అలసత్వం వెరశి నగరవాసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు.






