15-07-2025 02:55:27 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు చేయూతనిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మస్థైర్యంతో మంచి ఆలోచన ,పెట్టుబడి, నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించి ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న ఫాషన్ రంగంలో రాణిస్తున్న నాయిక ఫౌండర్ ఫల్గుణి నాయర్, అలాగే పిజ్జా తదితర వ్యాపారాలు ప్రారంభించిన వ్యాపారవేత్తలు ముందుగా చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు.
జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాల , సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఉద్దేశించి నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఒకరోజు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఎక్కువ మందికి సహాయం అందించవచ్చని ,అంతేకాక ఎక్కువ మందికి మేలు చేయవచ్చు అని చెప్పారు .ఎంఎస్ఎంఈ ద్వారా అనేక రకాల వ్యాపారాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ముద్ర లోన్లు, పీఎంఈజీపి కింద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేతివృత్తులు,చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని, వ్యాపారాల నిర్వహణకు బ్యాంకులు పెట్టుబడిగా లోన్లు మంజూరు చేస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాక ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయంతో పాటు ,శిక్షణ కార్యక్రమాలను ఇస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,తదితరులు పాల్గొన్నారు.