12-12-2025 06:31:48 PM
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహి ఎక్సపోర్ట్ మహిళా కార్మికులు చేపట్టిన ఐదో రోజు నిరసన ధర్నా కార్యక్రమానికి సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని మహిళా కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గత పది సంవత్సరాలుగా షాహి కంపెనీ యాజమాన్యం సరియైన వేతనం ఇవ్వకుండా మహిళా కార్మికుల శ్రమను దోచుకోవడం సిగ్గుచేటు అన్నారు.
రూ.పదివేల జీతాలు ఇస్తూ కార్మిక చట్టానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీ చాలని జీతాలతో కార్మికుల దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా యజమానులకే వత్తాసు పలుకుతూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు లేనిదే ఏ పరిశ్రమ ముందుకు పోదని శ్రమ దోపిడీ వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసిందని ఆయన తెలిపారు.
షాహి కంపెనీ మహిళా కార్మికులకు సిపిఐ అండగా ఉంటుందని యజమాన్యం మెడలు వంచి కార్మికులకు రావాల్సిన జీతాలు వసూలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళా కార్మికులను చూడకుండా మానసిక ఇబ్బందులను పెడుతూ వారి శ్రమను దోచుకుంటున్న కంపెనీ యజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మేంద్ర రచ్చ కిషన్ ఉప్పల్ మండల కార్యదర్శి సత్యప్రసాద్ పాల్గొన్నారు.