20-06-2025 10:17:02 PM
కొండపాక: కొండపాక మండలం(Kondapaka Mandal) మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం రాహుకాల పూజ క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6-30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి అభిషేకం నిర్వహించారు.
ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు.రాహుకేతు దోషనివారణ కోసం అష్టనాగపూజ నిర్వహించి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు అయితా బాలరాజేశం, నర్సింహారెడ్డి, చీకోటి రాజేంద్రప్రసాద్, తిరుపతి రెడ్డి, మర్యాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.