08-06-2025 12:00:00 AM
మానవాళి సక్రమమైన శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించేందుకు ప్రాచీన విజ్ఞానులు అందించిన అత్యద్భుతమైన వ్యాయామ ప్రక్రియ యోగా. శారీరక, మానసిక ఆరోగ్యమే కాదు మనిషిలో తాత్విక, ఆధ్యాత్మిక చింతనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేది యోగా అని ఏళ్ల క్రితమే చాటిచెప్పారు. యోగా పూర్తిగా శాస్త్రీయమైనది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా యోగా విస్తరిస్తున్నది. అలాంటి మహత్తర శక్తిని ఔపోసన పట్టిన యోగా గురువు అక్షింతల ప్రతాప్కుమార్.
ఆయన చిన్న వయస్సుల్లో అస్తమా బారిన పడి ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఒక్క ఆస్తమానే కాక కీళ్ల నొప్పులు, కండరాలకు సంబంధించిన వ్యాధులతోనూ సతమతమయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రతాప్కుమార్ కనీసం పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆయన చదువులో వెనుకబడ్డారు.
తల్లిదండ్రులు ఎన్నో రకాల మందులు వాడించినప్పటికీ ప్రతాప్కుమార్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవే అని తెలుసుకున్నారు. మందులు వాడినంత కాలం ఉపశమనం లభిస్తుందే కానీ, ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదు. పత్రికల్లో వచ్చిన ఒక ప్రకటన చూసి తల్లిదండ్రులు ఆయన్ను ఒక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
ఆ వైద్యుడు ఇచ్చిన మందుల కారణంగా ప్రతాప్కుమార్ ఎదుర్కొంటున్న అస్తమా సమస్య మరింత పెరిగింది. అస్తమా నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన ఇన్హేలర్ వాడటం మొదలుపెట్టారు. కొన్నిరకాల ఆయుర్వేద మందులు తీసుకున్నా పెద్ద ప్రయోజనం లేకపోయింది. అలాంటి సమయంలో ప్రతాప్కుమార్ తన పెద్దన్న ఇంట్లో యోగా సాధనకు సంబంధించిన పుస్తకాలు చదివారు.
దీంతో ఆయనకు యోగాపై ఆసక్తి పెరిగింది. క్రమంగా ఒక్కో ఆసనం సాధనం చేయడం ప్రారంభించారు. వీరేంద్ర బ్రహ్మచారి రాసిన పుస్తకాలు చదవడం ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో యోగా నేర్చుకున్నారు. యోగాపై డిప్లొమా తీసుకున్నారు. ఆసన ప్రాణాయామ, ధ్యానం సాధన చేయడంలో ఆయన పూర్తి పట్టు సాధించారు. అలా 99శాతం శారీరక, మానసిక రుగ్మతలను అధిగమించారు.
క్రమంగా యోగా నేర్పించడం మొదలు పెట్టారు. దేశ విదేశాల్లో ఆయన యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అలా 35 ఏళ్ల నుంచి వందలాది మందికి యోగా నేర్పించారు. ప్రతాప్కుమార్ భారతదేశానికి వారసత్వంగా వస్తున్న యోగా సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తూ వస్తున్నారు.
వయస్సు మీద పడుతున్నప్పటికీ కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆయన ఇండియన్ కమోట్నే వాడుతున్నారు. ఆయనకు ఎలాంటి కీళ్ల సమస్యలు లేవు. ప్రతిఒక్కరూ యోగ సాధన చేయాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావొచ్చని ప్రతాప్కుమార్ చెప్తున్నారు.