25-11-2025 02:39:29 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): మనస్తాపంతో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గడ్డమీది ఉమామహేశ్వర్(23) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య దీపికతో గత కొన్ని రోజులుగా సంసారం విషయంలో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంట్లో నుండి మనస్తాపంతో బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టు పక్కల వెతికారు. మంగళవారం ఉదయం గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.