17-06-2025 03:28:57 PM
కుప్పం: అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Andhra Pradesh Congress President YS Sharmila) పేర్కొన్నారు. సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్య ఇది అని, కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానం షర్మిలా వాపోయ్యారు. సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలుగింటి ఆడపడుచుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chief Minister Chandrababu Naidu) ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమని హేళన చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు ఇచ్చారా..? లేక మహిళా హోంమంత్రి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని షర్మిల ఎద్దేవా చేశారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టీ.. ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడండని హితవు పలికారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష(25) భర్త తిమ్మరాయప్ప కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో అదే గ్రామానికి చెందిన మనికన్నప్పతో 3 సంవత్సరాల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక భార్య శిరీష, పిల్లలను గ్రామం నుంచి తీసుకోని తిమ్మరాయప్ప వెళ్లిపోయాడు.
శిరీష సోమవారం తన కొడుకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి నారాయణపురం వెళ్లింది. సకాలంలో ఇచ్చిన డబ్బులను చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా మునికన్నప్ప, అతని కుటుంబం శిరీషను ఆమె బిడ్డ ముందు అవమానించారు. అప్పు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు ఆమెను ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేసిన కొట్టారు. స్థానికుల సమాచారంతో కుప్పం అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిరీషను విడిపించారు. మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.