17-06-2025 02:21:32 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా(Air India Plane Crash) విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఐదు రోజుల తర్వాత, ఇప్పటివరకు 135 మంది బాధితులను డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా గుర్తించామని, 101 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు మంగళవారం తెలిపారు. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు(DNA Tests) నిర్వహిస్తున్నారు. "మంగళవారం ఉదయం వరకు, 135 డీఎన్ఏ నమూనాలను(DNA Samples) సరిపోల్చారు. 101 మృతదేహాలను ఇప్పటికే సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. ఈ 101 మంది మరణించిన వారిలో ఐదుగురు విమానంలో లేరు" అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్(Ahmedabad Civil Hospital) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి విలేకరులకు తెలిపారు.
గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, డయ్యూలోని వివిధ ప్రాంతాలకు చెందిన 101 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం నాటికి బాధితులందరి డీఎన్ఏ ప్రొఫైలింగ్ పూర్తవుతుందని డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి 242 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్లోని ఒక మెడికల్ కాలేజీ కాంప్లెక్స్పైకి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. లండన్ వెళ్తున్న విమానంలో 241 మంది మరణించగా, రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది నేలపైనే మరణించిన విషయం తెలిసిందే.