16-12-2025 02:25:11 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని (లీగల్ సెల్) ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని భరోసా ఇచ్చారు. ‘మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం.
అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ను కాపాడలేకపోయారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా ప్రజలు, తమ పార్టీ నేతలు నిలబడ్డారని, అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీని గెలిపించారని అన్నారు.
పదవి ముఖ్యం కాదు.. పనే ముఖ్యం
సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని హితవు పలికారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.