16-12-2025 12:05:05 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని వీరుల సైనిక స్మారక్ (Amar Jawan Memorial) వద్ద విజయ్ దివస్(Vijay Diwas) సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి పుష్పగుచ్ఛాలు అర్పించి, అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేశ స్వాతంత్ర్యం, ఐక్యత, గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను అర్పించిన ఆ అమరవీరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరచిపోదు, వారి ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో(India-Pakistan war) పాల్గొని బంగ్లాదేశ్ విముక్తికి కీలక పాత్ర పోషించిన సైనికుల త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆ యుద్ధంలో భారతదేశానికి విజయం సాధించడంలో దార్శనిక నాయకత్వం అందించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ధృడ సంకల్పాన్ని, సైనిక నాయకత్వాన్ని వహించిన అధికారులను, ప్రాణాలు అర్పించిన అమరవీరులను కృతజ్ఞతతో స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వారి త్యాగాలకు నివాళిగా, దేశ గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు.