2 March, 2026 | 2:58 AM

పోలీసుల సంక్షేమానికి పెద్ద పీట

02-03-2026 01:15 AM

డీజీపీ శివధర్‌రెడ్డి 

మహబూబాబాద్, మార్చి 1(విజయక్రాంతి): ప్రజారక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించారు. బాధిత మహిళలు, బాలికలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, జిల్లా కేంద్రాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసుల సహాయం, మానసిక పరామర్శ, వైద్య సేవలు, న్యాయ సహాయం, సహాయనిధి అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు జనగామలో నూతనంగా షీ టీమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను డీజీపీ ప్రారంభించారు.

వరంగల్ కమిషన్ రేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విభా గాలకు చెందిన అధికారిక వాహనాల ఇంధన అవసరాలను ఈ ఫీలింగ్ స్టేషన్ ద్వారా తీర్చనున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నగర కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీపీసీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, కవిత, ఏఎస్‌పీ శుభం, ఏసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, అంతయ్య, సురేంద్ర పాల్గొన్నారు.