గడ్డి మందుపై పూర్తి నిషేధం విధించాలి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్
వరంగల్, మార్చి 27 (విజయక్రాంతి): గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, ఆత్మహత్యలకు ఆయుధంగా మారిన పారాక్వాట్ నిషేధమే దినికి పరిష్కారమని లోక్ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. పారాక్వాట్తో రైతులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని, ఐ ఎం ఏ సహా వైద్య వర్గాల నుంచి గడ్డి మందు నిషేధానికి బలమైన మద్దతు పెరిగిందన్నారు. ప్రాణాంతక గడ్డి మందుపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) అనే అత్యంత ప్రమాదకర హర్బిస్పై తక్షణమే పూర్తి నిషేధం విధించాలని ఎంపీ కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభలో డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) వినియోగం వల్ల నేల, నీరు, ఇసుక తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయని, దీని ప్రభావం వ్యవసాయ వ్యవస్థలపై తీవ్రమవుతోందని కావ్య స్పష్టం చేశారు.
ఇది కేవలం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాణాంతక ముప్పుగా మారిందని హెచ్చరించారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ రసాయనం గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు మరణాయుధంగా మారిందని ఎంపీ పేర్కొన్నారు. పారాక్వాట్ సేవించిన సందర్భాల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, దీనికి ఇప్పటివరకు సమర్థవంతమైన యాంటిడోట్ లేకపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోందన్నారు. తెలంగాణలోని వరంగల్ సహా పలు జిల్లాల్లో ఇది ఆత్మహత్యలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రమాదకర సాధనంగా మారిందని వరంగల్ ఎంపీ కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, పర్యావరణం, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) తయారీ, విక్రయం, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.




