23-06-2025 04:48:11 PM
ప్రభుత్వ పాఠశాలో బిడ్డను చేర్పించిన ప్రభుత్వ ఉద్యోగి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన బిడ్డను ప్రభుత్వ బడిలో చేర్పించడంతో పాటు 20 వేల రూపాయలను ప్రభుత్వ పాఠశాలకు డొనేషన్ గా చెల్లించిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కంబాలపల్లిలో సోమవారం జరిగింది. కంబాలపల్లి గ్రామానికి చెందిన కొలిశెట్టి సత్యనారాయణ జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు భవిష్య పటేల్ ను పట్టణంలోని కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అధునాతన డిజిటల్ విద్యా బోధన, ఇక్కడ మౌలిక వసతుల కల్పనతో పాటు పదో తరగతి ఫలితాల్లో మానుకోట జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఆకర్షితులై తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చేర్పించారు.
అలాగే పాఠశాల అభివృద్ధి కోసం 20 వేల రూపాయలను డొనేషన్ గా అందజేశాడు. అలాగే విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, టీ షర్ట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... సత్యనారాయణతో పాటు తన స్నేహితుల పిల్లలను, తన సోదరుని బిడ్డ సుభిక్షను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందిన ఇద్దరు విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పూర్ణచందర్, పరిమళ, మైస శ్రీనివాస్, ఉప్పలయ్య, శ్రీలక్ష్మి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.