ఘనంగా సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం
బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఆధ్యాత్మిక వాతావరణం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి
పటాన్చెరు, మార్చి 22: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1000 సంవత్సరాల ప్రాచీన సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, రుద్రాభిషేక కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని దేవుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామకృష్ణ, రఘునాథ్ రెడ్డి, భాస్కర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




