25-10-2025 12:07:18 AM
-రూ.2,780 కోట్లు విడుదల చేసిన సర్కార్
-138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ర్టంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ర్టవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది.
తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ర్టమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ర్టంలోని 138 మున్సిపాలిటీల్లో రూ. 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ర్ట బడ్జెట్లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ ఫండ్ పథకాల నుంచి ఈ నిధులను మంజూరు చేసింది.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్లు మంజూరు చేశారు. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెర్వులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాలు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు.