09-06-2025 12:00:00 AM
“అతులంబై, యకలంకమై,
ప్రభు సమాజకర్ణ్యమై, వర్ణ్యమై
యతి పాపాపహమై, శుభావహమునై,
యా చంద్ర తారార్క సు
స్థితమై యుండెడుగాక, వేంకటనగాధి స్వామి యుష్మద్గుణాం
కితమేతత్కృతి యీక్షితిన్ కవిజనాంగీకార సారోన్నతిన్”
అన్న ఈ గొప్ప పద్యం ‘ద్రౌపదీ కల్యాణ ము’ అనే కావ్యంలో పానుగల్లు దుర్గాధిపతియైన కుమార వెంకటరాయలు రచించింది. కుమార వెంకటరాయలు పెదపానుగల్లు దుర్గాధిపతి, పద్మనాయక ప్రభువు. స్వయంగా కవి, కవులను పోషించిన ప్రభువు. మన తెలుగు సాహిత్యంలో పాలకులై వుండి కవులుగా రాణించి తెలుగు సాహితీ ప్రపంచంలో పేరెన్నిక గన్నవారు చాలామందే ఉన్నారు. నన్నె చోదుడు, శ్రీకష్ణ దేవరాయలు, రఘునా థ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారి కోవలోని వాడే ఈ కుమార వెంకటరాయలు. పలువురు కవులను పోషిస్తూనే తానూ కవిత్వ రంగంలో రాణించి ‘ద్రౌపదీ కల్యాణ’ రచన చేశాడు.
‘ద్రౌపదీ కల్యాణం’ వేంకటేశ్వరునికే అంకితం
అయిదాశ్వాసాలున్న ‘ద్రౌపదీ కల్యాణ ము’ సప్తగిరీశుడైన వేంకటేశ్వరునికి అంకితం చేసి, రచించిన పై పద్యంలో తన రచన ఔన్నత్యాన్ని వివరిస్తూ తన కృతి సాటి లేనిదని, ఏ కళంకమూ లేనిదని, సామాజిక వివరాలను కలిగి వున్నదని, గొప్పగా వర్ణింపదగిందని, పాపాలను పోగొట్టేదని, శుభాలను కలిగించేదని, ఆచంద్ర తారార్కం నిలిచేదని, అటువం టి కావ్యానికి స్వామియే కృతి భర్త అని పేర్కొన్నాడు.
పైగా ఈ కావ్యం కవులు అంగీకరిం చిన గొప్ప రచన అని కూడా చెప్పడం విశే షం. ఒకానొక రోజు వేంకటేశ్వరస్వామి స్వ ప్నంలో కనిపించి ‘ద్రౌపదీ కల్యాణ’ కావ్యాన్ని రచించమని ఆదేశించి అంతర్ధానమయ్యాడని కవి అవతారికలో పేర్కొని ఈ కావ్యాన్ని స్వామికే అంకితమిస్తున్నట్టు చెప్పాడు. ఈ పద్యం తన రచనను గురించి చెప్పిందే కావ చ్చు కానీ, ఒక ఉత్తమ కృతి ఎట్లా ఉండాలో కూడా చెప్పే ప్రయత్నం ఇందులో ధ్వనిస్తున్నది.
ఒక కావ్యం ఎప్పుడు సాటి లేని రీతిలో రచింపబడాలి. అంతేగాక దానిలో ఏ కళంకమూ ఉండరాదు. అందులో సమాజపు విశేషాలు చోటు చేసుకొని ఉండాలి. పదిమం ది దానిని మెచ్చుకొని దాని గొప్పదనాన్ని వర్ణించి చెప్పాలి. ఆ కావ్యం పవిత్రమై పాపాలను పోగొట్టగలగాలి. సకలశుభాలనూ కలిగించేది కావాలి. అది పది కాలాలపాటు నిలిచేదై ఉండాలని సూచించాడు కవి.
పెద పానుగల్లు దుర్గంపై వర్ణన
ఈ పద్మనాయక ప్రభువైన కుమార వెంకటరాయల వారి తల్లి పేరు రామాంబ, తండ్రి పేరు వెంకటరాయడు. వీరిది పెన్బాల గోత్రం, ఈయన 17వ శతాబ్దపు మధ్య కాలంలోని వ్యక్తిగా సాహిత్య చరిత్రకారులు నిర్ధా రించారు. తన కావ్య వైశిష్ట్యాన్ని చెప్పే పద్యా న్ని రచించి, వేంకటేశ్వరునికి అంకితం చేసిన పద్యాన్ని చెప్పిన వెంకటరాయలు కృతి తొట్టతొలి పద్యంలో కూడా ఆ స్వామినే కీర్తిస్తూ
“శ్రీవత్సాంకము, భూమిభామయును దృష్టిం జేష్టలం దత్సమీ
క్షావృత్తిన్ తన దివ్యకౌస్తుభ
మణీచ్ఛాయన్నిరోధించి లీ
లావైముఖ్యము దోపకుండ
నలమేల్మంగంబరీరంభ సౌ
ఖ్యావిర్భూతి నలర్చు వేంకట
నగాధ్యక్షుండు మమ్మేలుతన్”
మొదటి పద్యంలోనే స్వామివారిని అలంకారికంగా స్తుతించి, తదనంతర పద్యాల్లో దేవతా స్తుతి, జననీ జనకుల స్తుతి చేశాడు. రెండో పద్యంలో తమ ఇలవేల్పయిన నరసింహస్వామిని, మూడవ పద్యం నుంచి శివ, బ్రహ్మ, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీ దేవి, విష్వక్సేనుడు, పన్నిద్ధరాళ్వారులు, రామానుజాచార్యుని ఒక్కో పద్యంలో ఒక్కొక్కరిని స్తుతించాడు. ఆ తరువాత తండ్రిని, సంస్కృత మహాకవులైన వాల్మీకి, వ్యాస భగవానులను, కాళిదాసాది సంస్కృత కవులను, కవిత్రయం వారిని, పోతన శ్రీనాథ పెద్దనాది కవులను కీర్తించిన కవి తాను పాలిస్తున్న రాజ్యానికి కేంద్రమైన పెద పానుగల్లు దుర్గాన్ని ఘనంగా వర్ణించాడు.
‘బోరవెల్లి’ సంస్థాన కవి
గద్వాల సమీపంలోని ‘బోరవెల్లి’ సంస్థా నం వారు కూడా గొప్ప సాహితీ సేవ చేసిన పాలకులు. ‘అనర్ఘ రాఘవ’ కృతి కర్తయైన బిజ్జల తిమ్మభూపాలుడు బోరవెల్లి సంస్థానాధీశుడు. ఆ సంస్థానంలోని కవి అయిన ‘బోర వెల్లి నరసింహకవి’ కుమార వెంకటరాయల -గురువు. ఈ విషయాలనే స్వయంగా చెప్పుకొ ని తమ గురువు పూర్వులందరూ కవులేనని పేర్కొంటూ
“మీతాత తాతకు భ్రాతృజ సూతికదా రాయసము మల్ల సూరి ‘చంద్ర
భాను చరిత్ర’ మొప్పగ జెప్ప, మీ తాత దత్తన్న శబ్దశాస్త్ర ప్రవీణు
డతని సుతుండు కృష్ణప్ప ‘యయాతి చరిత్ర’ మిశ్ర కావ్య మొనర్చె మీ జనకుడు
చేసితి వీవు దక్షిణకాశ్యలంపురినృహరిద
యోదయామహితకలిత
‘కృతి యతని కంకితముగ
బండితుల మతుల
నెనయ ‘సౌపర్ణాఖ్యాన మనగ నొకటి
యుభయ భాషావిశేషోక్తియు (శిథిలము)
సిద్ధముగ సంప్రదాయ ప్రసిద్ధి గనుచు”
అని నరసింహ కవి తాత ముత్తాతలను గురించి, వారి రచనలను గురించి సష్టంగా పేర్లతోసహా చెప్పి తన కవితా గురువుపై వున్న గురుభక్తిని చాటుకున్నాడు కుమార వెంకటరాయలు. ఈయన విశిష్టాద్వైత ధర్మ ప్రవర్తకుడైన వైష్ణవుడైనను శరన్నవరాత్రులను ఆచరించి, ఆ సందర్భంలో లక్ష్మీ సర స్వతులను ఆరాధించే వాడనని కూడా తన కావ్యావతారికలో చెప్పుకున్నాడు.
గర్భ కవిత్వంలో విశేష ప్రతిభ
‘అనపద్య విద్యావిశకంటుడు’గా కీర్తిని అందుకున్న ఈ రాజకవి
“గోపగోపక గోప గోపనల్ నలువొందు నీదయోదయ భోగనియతి కలన
రాజరాజ వరాజురాజజులు జులుకన నీ నిదాన ధనారి నిధన నిధుల
ధర్మ ధర్మజ ధర్మ ధర్మములు సూప వరయ నీ శమన సత్య ఋతిగతుల
రామ రామారామ రామమూర్తులతుల నీ బలధర్మార్థ నిశ్చయములు
గండ భేరుడ గండర గండ చండ
సమర నిశ్శంక బిరుదాంక సదకలంక
పదవిశంకట ప్రభు కులాధి
నాయక కుమార వెంకటరాయ ధార”
అంటూ పేరొందిన వెంకటరాయ కవి గర్భ కవిత్వం వంటివాటిలో విశేష ప్రతిభ కలిగిన కవి. ఆశ్వాసాంత పద్యాల్లో కుమార వెం కటరాయలు గొప్పవృత్త వైవిధ్యాన్ని చూపి ఛంద స్సుపై తనకున్న అధికారాన్ని చాటుకున్నాడు.
స్వప్నంలో వెంకన్న దర్శనం
వేంకటేశ్వర స్వామి ఈ కవికి స్వప్నంలో కా వ్య నిర్మాణం చేయమని ఆనతిచ్చిన అంశాన్ని తన గురువు అయిన బోరవెల్లి నరసింహ కవికి తెలిపినప్పుడు, ఆయన ఎంతో సంతసిం చి ఈ కావ్యాన్ని తప్పక రచించమని ప్రేరణ నిచ్చిన కారణంగానే ఈ రచన వెలుగులోకి వచ్చింది. ఈ రాజకవిని తెలుగు సాహితీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంతటి అపురూపమైన కావ్యం అచ్చుకు నోచుకోక పోవడం బాధాకరమే. ఆ విషయాన్నే సుప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులైన ఆరుద్ర “ఈ ద్రౌపదీ కల్యాణం అచ్చు పడితే కవిజనాంగీకారం పొందవచ్చు” అన్నారు.
ఈయనకు ఉన్న గురుభక్తిని ప్రకటిస్తూ బోరవెల్లి నరసింహ కవి తన సభలోకి ప్రవేశించిన సందర్భంలో
“ఆర్వేలాన్వయ గేయ రాయసము మల్లామాత్య సూర్యస్వ వా
యోర్వీదేవమత స్వతంత్ర కపి గోత్రోద్భూత దత్తాహ్వయాం
తర్వాణి ప్రియసూను కృష్ణ విదూషాత్మా ప్రోద్భవుండైన యీ
బోర్వెల్లీపుర నారసింహకవి సంబోధించి యిట్లంటొగిన్”
అంటూ సంబోధించాడన్న పద్యం కవికి గు రువుపై వున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది.
పూర్వులు మెదక్ పాలకులు
ఒక పాలకుడు తన సభకు వచ్చిన కవిని గౌరవించడం సంప్రదాయం. ఇక్కడ సభకు వచ్చిన నరసింహ కవి కేవలం కవి మాత్రమే కాదు. ఆ పాలకునికి గురువు, ఆయనను ప్రోత్సహించి ఒక కావ్యాన్ని రచింపజేసిన మహామ హుడు. అందుకే వెంకట రాయలవారు గురు వు పూర్వులను పేర్కొంటూ, గోత్ర సహితంగా నంబోధించి మాట్లాడడం ఆయన సంస్కారానికి ప్రతీక.
కుమార వెంకటరాయల పూర్వులు కుతుబ్షాహి రాజులకు అణకువుగా నుండి ‘మెతుకు’ (మెదక్) దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పాలించిన ప్రభువులని చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ బోయినపల్లి ప్రభువుల వారిలోనే ఒకరైన -ఈ కుమార వెంకటరాయలు మా త్రం పెదపానుగల్లు దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పాలించిన దుర్గాధిపతి.
జలక్రీడలపై ప్రేమాభిమానాలు
“కృష్ణవేణీ జలక్రీడా వినోదనా!” అని వెంకటరాయల వారికి ఉన్న బిరుదాన్నిబట్టి ఈయన కృష్ణానదిలో ఈదడమంటే మిక్కిలి ప్రీతవిత్రమైన విషయంగా సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. తండ్రిపేరు కూడా వెంకటరాయలే కావడం వల్ల ఈయనను కుమార వెంకటరాయలుగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. గొప్ప గురుభక్తి, పండిత పోషణ, కావ్యనిర్మాణ చతురత, పాలనా దక్షత వంటి పలు ప్రత్యేక గుణాలున్న వ్యక్తిగా పానుగల్లు దుర్గాధిపతి అయిన కుమార వెంకటరాయలు ‘ఉత్తమసాహితీ విలువలు ఉన్న రాజకవి’గా మన్ననలు పొందిన మహనీయుడు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448