calender_icon.png 20 June, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ప్రతిజ్ఞా ప్రదాత

10-06-2025 12:00:00 AM

నేడు పైడిమర్రి జయంతి :

‘భారతదేశం నా మాతృభూమి ’ ప్రతిజ్ఞ ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, సమగ్రతను చాటిన తెలుగుతేజం పైడిమర్రి వెంకట సుబ్బారా వు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘వందేమాతరం’ పా ట ఎలాగైతే భారతీయుల్లో దేశభక్తిని, స్వరాజ్య కాంక్షను పెంచిందో, స్వాతంత్య్రానంత రం పైడిమర్రి జాతీయ ప్రతిజ్ఞ భారతీయులలో ఐక్యతను, దేశభక్తిని, జాతీయతను భవిష్యత్ తరాలకు చాటేలా రూపొందింది.

1916 జూన్ 10న నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రా మంలో జన్మించిన పైడిమర్రి మంచి రచయిత, బహు భాషావేత్త. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. పుస్తక పఠనం, పుస్తక సేకరణ, కవితా వ్యాసంగం, వేదాధ్యయనం చేసేవారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పలు రచనలు చేశారు.

ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ పేరున చిన్న నవల రాశారు. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథా రచయితగా నిలిచారు. దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, స్రీధర్మం, ఫిరదౌసి, శ్రీమతి పేరున నాటకాలు రాశారు. అదే విధంగా అనేక అనువాద రచనలు చేశారు. 1945-46లలో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. పైడిమర్రి రచనలు, సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం.

‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను...” అంటూ సాగే ప్రతిజ్ఞ నేడు దేశంలోని ప్రతి పాఠశాలలో పసిహృదయాలలో గుండెల నిండా దేశభక్తిని పాదుకొల్పుతున్నది. ఈ ప్రతిజ్ఞ 1962లో పైడిమర్రి కలం నుంచి పురుడు పోసుకున్నది. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీ వేత్త తెన్నేటి విశ్వనాథం, నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు.

‘ప్రతిజ’్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశంలో ‘జాతీయ ప్రతిజ్ఞ’గా ఆమోదించారు. 1965 జనవరి 26 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఈ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతున్నది. భారతదేశ జాతీయ సమైక్యతను తెలియజేసే ప్రతిజ్ఞ రచయితగా ఆయన పేరు తగిన రీతిలో ప్రాచుర్యంలో లేకపోవడం పెద్ద చారిత్రక తప్పిదం.

పైడిమర్రి కుటుంబ సభ్యుల సహకారంతో దీనిని గుర్తించిన ఎలికట్టి శంకర్రావు 2011లో కొందరు తెలంగాణ సాహితీ మిత్రులతో కలిసి ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రింప చేయాలని జనవిజ్ఞాన వేదిక ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఫలితంగా 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ‘మన మహనీయులు’ విభాగంలో పైడిమర్రి జీవిత వివరాలను పొందు పర్చారు. ప్రతి ఒక్కరూ ప్రతిఙ్ఞ పదాలను మొక్కుబడిగా ఆలపించకుండా, వాటి అర్థం, పరమార్థం తెలుసుకొని ఆచరించాలి. 

 యం.రాం ప్రదీప్