ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కూసుమంచి టీజీఈ జాక్ డిమాండ్
కూసుమంచి,(విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కార్యాచరణ సమితి (TGEJAC)కూసుమంచి యూనిట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 2వ పీఆర్సీ ని తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.
పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ.13,000 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి, పెన్షనర్లకు ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలి. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సైదులుకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో TGE JAC నాయకులు రాయల వీరస్వామి, శీలం ఆంజనేయులు, మండవ నరసయ్య, భద్రు, ఎం సతీష్, సిహెచ్ శ్రీనివాసరావు, యాకయ్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






