ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టీబీ పరీక్ష శిబిరం
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబి పరీక్షల శిబిరాన్ని ఆ గ్రామ సర్పంచ్ కీసర వెంకటరమణ బుచ్చిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు ఇచ్చే సలహాలను పాటించి క్షయ వ్యాధిపట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ... భారతదేశాన్ని టీవీ రహిత దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయడంలో భాగంగా నిర్వహించే 100 రోజుల కార్యక్రమం అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధి నిర్ధారణ కొరకు స్కూటం పరీక్షలు,ఎక్స్రే పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే అటువంటి వ్యక్తులకు టీవీ మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ నరేష్ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పోస్ట్ ఆఫీస్ ఫీల్డ్ అసిస్టెంట్లు రేషన్ డీలర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.






