calender_icon.png 19 June, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన వంతు

09-06-2025 12:00:00 AM

డి.రామలింగం యాదిలో..

గోపాలం గారి అల్లుడి సంగతి ఆ వీధిలో రోజురోజు తెలిసిపోతూంది. ఎవరైనా పెండ్లిసంబం ధాలు మాట్లాడుకుంటూ గోపాలం గారి విషయం కూడా తెచ్చి నిట్టూర్పు విడువని వారులేరు. మొత్తానికి కూతురు విషయంలో గోపాలం గారు పడే అవస్థలు అనుకొని అంతా జాలిపడే వారే.

గోపాలం గారు నిజంగా ఎంతో మంచివాడని చెప్పవచ్చు. తన పనియేదో తానే. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోడు. ఎవరైనా మాట్లాడిస్తే ఎంతో ఆప్తబంధువులా మాట్లాడుతాడు. తన సంసారాన్ని ఎంతో గుట్టుగా జరుపుకుంటూ, నలుగురిలో మర్యాదస్థుల ఇల్లు అనిపించుకున్నాడు. ఆయనకు యే ఉద్యోగమూ లేదు. పిత్రార్జితం అయిదెకరాల మాగాణితో తనూ, తన భార్యా, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు గల సంసారాన్ని బాగానే జరుపుకుంటున్నాడు. వారింటి విశేషాలు తెలు సుకుందామన్నా తెలిసేవి కావు ఎవరికీనూ. కాని అల్లుడు వచ్చి న మరుక్షణం నుంచి అందరి నోళ్ళల్లోను గోపాలం గారి గృహపరిస్థితులే.

తన పెద్దకూతురు గుణమ్మ పెండ్లి యీడుకు వచ్చిందని సంబంధాలు అనేకచోట్ల విచారించి పోయిన సంవత్సర మే రాజేశ్వరరావుకిచ్చి పెండ్లి చేశాడు. పిల్లవాడు చూపులకు బాగా వున్నాడనీ, బి.యల్. చదువుకున్నాడనీ, మంచి కుటుంబానికి చెందిన వాడనీ తనూ, తన భార్యా యిష్టపడి కుదుర్చుకున్నారు. పెండ్లి అయిన తర్వాత నుంచీ ఈ యిబ్బందులన్నిటికీ గురి అయ్యారు. ‘నీటిలోతు అందులో దిగితేనే గాని తెలియదంటారు.’

గోపాలం గారు బజారునుంచి రాగానే రమణమ్మ వచ్చిన టెలిగ్రాం కాగితాన్ని భర్త చేతికిచ్చింది. బజారు నుంచి ఏవేవో పనులమీద తిరిగి వచ్చిన ఆయాసానికితోడు ఇదొక వార్తా విశే షం. టెలిగ్రాం చూచుకొని

“సరే” అని శ్వాస విడిచాడు!

భోజనాలయిం తర్వాత రమణమ్మ

“ఏమండీ, ఈ అబ్బాయి చూడబోతే మన అంతు తెలిసికొనేలా వున్నాడు. పోయిన పదినెల్ల నుంచీ ప్రతి నెలా వం ద రూపాయలు పంపిస్తూనే వున్నాం. డబ్బు పంపమని వ్రాసే ఉత్తరం తప్ప మరో ఉత్తరం వ్రాయడు. ఎంత కాలమిలా పంపగలం” అన్నది.

“నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ నెలతో అతని బి.యల్ చదువు పూర్తవుతుంది. తర్వాత ఏదో ప్రాక్టీసు పెట్టుకొని గడుపుకోవాలి. లేకపోతే ఇక మ నం అతని ఖర్చు భరించలేం” అన్నాడు గోపాలం గారు చొక్కా వేసుకుంటూ.

“తండ్రికి పింఛను వస్తుంది. పైగా సాలీనా అయి దు వేల ఆదాయం వచ్చే పాలం వుంది. ఈ అబ్బా యి మాత్రం మనకే వ్రాస్తూంటాడు డబ్బు పంపమ ని, ఏమిటో నా కర్థం కావడం లేదు ఇదంతా?” అన్నది రమణమ్మ కోపంతో.

“తండ్రి కానీ డబ్బు పంపడు. నిన్ననే గదూ శ్రీరాములు గారు చెప్పాడీ సంగతి. ఆయన గారికేదో అప్పుందట. ఈ సంవత్సరం ఏదో కొత్తగా పెట్టిన కంపెనీలో షేర్లుకొని డైరక్టరయ్యాడట. దీనికి మరికొంత అప్పు. తన ఆస్తి వృద్ధి అయే ఉపాయాలు చూస్తున్నాడు కాని కొడుకు సంగతి ఏమీ పట్టించు కోకుండా మనకు వదిలేశాడు” అన్నాడు గోపాలం గారు లేచిపోతూ.

“సరే, ఇప్పుడు వంద రూపాయలెట్లా పంపించేది! మొన్ననే వున్న వందా పెద్దబ్బాయికి విశాఖప ట్నం పంపామయ్యే. చేతిలో కాని లేదు” అని అడిగింది రమణమ్మ తనూ లేస్తూ.

“ఈ దఫాకు ఇలా రామయ్యగారి దగ్గర చేబదు లు తీసుకుంటాను” అని గోపాలం గారుపై కండు వా వేసుకున్నాడు.

“సరేగాని డబ్బు పంపుతూ సెలవుల్లో ఇక్కడికి తప్పక రావలసిందని ఉత్తరం వ్రాయండి మరచి పోకుండా..”అన్నది గుమ్మం దాకా పోయిన భర్తతో.

గోపాలం గారు వ్రాసినట్టుగానే సెలవుల్లో రాజేశ్వర రావు వచ్చాడు. అత్తవారిల్లే అయినప్పటికీ పరాయి చోట వున్నట్టే వుంటాడు. అత్తమామలతోగాని, బావమరదలతోగాని అసలు మాట్లాడనే మాట్లాడడు. పైగా ఎంతో గంభీరంగా బెట్టుసరిగా వుంటాడు. ఇంట్లో వుంటే తన గదిలో వుంటాడు. లేకపోతే తనకు దూరపు బంధువులైన సుబ్బారావు గారింటికి వెళ్లుతాడు. తన మామగారి తాలూకు బంధువు లెవరైనా వచ్చి పలకరించితే ఏదో ముక్తసరిగా జవాబు చెప్పి వాళ్ళను పట్టించుకోకుండా వుంటాడు. ఒక్కొక్కప్పుడు ఆ మాత్రం తిరుగు జవాబైనా చెప్పకుండాపోతాడు. బావమరదులొస్తే చీదరించుకుంటాడు. సరే, భార్యతోనైనా అనురాగంగా వుంటాడా అంటే ఆదీ లేదు. చీటికీ మాటికీ కోపగించుకుంటాడు, మాట్లాడడు.

మరునాడు గోపాలం గారు అల్లుడికి కొత్త వస్త్రా లు కొనుక్కొచ్చారు. అవి ఖద్దరువనీ, అంత బరువైనవి కట్టననీ తిప్పికొట్టి భోజనాలయిం తర్వాత గోపాలం గారి దగ్గర కెళ్లి 

“నేను ఇవాళ సాయంత్రం బండికి ఇంటికి వెళ్లుతున్నాను. వచ్చే పౌర్ణమి ముందు మీ కూతురును మా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి పొండి” అని గోపాలం గారు తిరుగు అడిగిన దానికి సమాధా నం చెప్పకుండానే వెళ్లిపొయ్యాడు. తన ముచ్చట తీరనందుకు రమణమ్మ ఆనాడంతా కుమిలి పోయింది.

రోజులు గడిచాయి. గోపాలం గారి కష్టాలు -గట్టెక్కాయి. సుగుణమ్మ భర్తతో ఆత్తవారింటిలో కాపు రం చేస్తూ వుంది. రాజేశ్వరరరావు ప్రాక్టీసు మొదలుపెట్టాడు. కాని కేసులు ఏమి రావడం లేదు. గోపాలం గారికీ సంగతి తెలిసి తన పలుకుబడి చేత

కొంతమందికి చెప్పి పంపాడు. వారంతా వెళ్లి ‘గోపాలం గారు చెప్పితే వచ్చాం. మాకేసును చూ డండి’ అని చెప్పుకునే వారు. అంతా బాగానే నడచిపోతూంది.

***   ***

కాల ప్రవాహంలో పదునాలుగు సంవత్సరాలు కొట్టుకొని పొయ్యాయి. ఇప్పుడు రాజేశ్వర రావు నలుగురు బిడ్డల తండ్రి. ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు సుశీల పదునాల్గేండ్ల ప్రా యంలో నిగనిగలాడుతూంది.

కూతురు వాలకం చూస్తే రాజేశ్వర రావుకు తన విధి స్ఫురించుతూంటుంది. ఇరుగు పొరుగు వారు

“పెద్దమ్మాయి కెక్కడన్నా సంబంధం చూచారా!” అని అడిగినప్పుడల్లా నిద్ర నుండి అకస్మాత్తుగా జాగ్రదావస్థలోకి వచ్చిన వానికి మల్లే త్రుళ్లి పడుతూంటాడు. చుట్టపక్కాలు వచ్చి 

“పెద్దకూతురు కింకా పెండ్లి చేయలే దేం?” అని అంటే ఎవరో తనను వెంటబడి తరుముతూన్నట్లు అనిపించి తను కూతురుకు వరుణ్ని వెతక్క తప్పిం ది కాదు రాజేశ్వర రావుకి.

ఏలూరులో ఎరిగిన వారున్నారని పెళ్లి ప్రసక్తి తెస్తే  

“చూడండి! మా వాడు ఈ సంవత్సరం ఇంటరు ప్యాసయ్యాడు. యం.బి.బి.యస్. ఏమైనా చెప్పించ గలరా?” అని అడిగారు.

తెనాలిలో తెలిసిన వారున్నారని వారింటి చుట్టూ నాలుగుమార్లు తిరిగితేె

“అక్కరలేదు, మీ కంటే ఎక్కువ వరదక్షిణ ఇస్తామని వచ్చారు నిన్న బెజవాడ నుంచి. ఆ సంబం ధం ఖాయం చేసుకున్నాం” అని సాగనంపారు.

బందరులో బంధువులైన వాళ్లున్నారు. సంబం ధం మంచిది. ఆనుకొని వెడితే 

“మా వాడి కిష్టం లేదుట” అని అన్నారు.

“పెండ్లి సంబంధం కుదరడమే ఇంత కష్టంగా వుంది. ఇక, కుదిరితే ఎన్ని ఇబ్బందులో..” అని దీర్ఘ నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు రాజేశ్వరావు.

ప్రచురణ కాలం: నవంబరు 1946, కథాంజలి

‘కథానిలయం’ సౌజన్యంతో..