19-07-2025 11:58:12 PM
చంగూర్ బాబా ఎపిసోడ్లో కొత్త కోణం..
లెటర్ హెడ్పై ప్రధాని ఫొటో వాడిన బాబా..
న్యూఢిల్లీ: మతమార్పిడుల రాకెట్ నిర్వహిస్తున్నాడనే అభియోగాల మీద అరెస్ట్ అయిన యూపీకి చెందిన చంగూర్ బాబా(Changur Baba) విషయంలో విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. చంగూర్ బాబా తనను తాను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థకు చెందిన సీనియర్ కార్యకర్తను అని చెప్పుకోవడమే కాకుండా, తన సంస్థ లెటర్ హెడ్స్పై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను కూడా ఉపయోగించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో కీలక నిందితుతుడు ఈదుల్ ఇస్లాం నిర్వహిస్తున్న ‘భారత్ ప్రతీకారత్ సేవా సంఘ్’ అనే సంస్థకు చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ ప్రధాన కార్యదర్శి (అవధ్)గా కొనసాగుతున్నాడు. ఈ సంస్థ పేరును వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈదుల్ ఇస్లాం ఆర్గనైజేషన్ను ప్రజలు నమ్మేందుకు నాగ్పూర్లో ఓ బోగస్ కార్యాలయాన్ని కూడా నెలకొల్పారు.
ఆర్ఎస్ఎస్ నేతల పేర్లు వాడి..
రాజకీయ నాయకులు, అధికారులతో సమావేశాల సందర్భంగా చంగూర్ బాబాతో పాటు ఇస్లాం కూడా పలువురు ఆర్ఎస్ఎస్ నేతల పేర్లు వాడారు. అంతే కాకుండా తాము కూడా అదే సంస్థకు చెందిన వారమని చెప్పుకునేవారు. బలరాంపూర్లో మతగురువుగా ఉండి పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడుతున్న చంగూర్ బాబాను స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన మైనర్ బాలికలే టార్గెట్గా బాబా మతమార్పిడుల రాకెట్ నిర్వహించాడు.