calender_icon.png 14 June, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రంలో రైతుకు విధిగా రశీదు ఇవ్వాలి..

17-05-2025 10:20:27 PM

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి..

రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి (విజయక్రాంతి): వరి కొనుగోలు కేంద్రంలో తూకం చేసినప్పుడే తాలు, తరుగుతో కలుపుకొని ఎన్ని క్వింటాళ్ల ధాన్యం తూకం చేశారో రైతుకు రశీదు ఇవ్వాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. శనివారం సాయంత్రం వనపర్తి పట్టణంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అధ్యక్షతన వరి కొనుగోలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి  ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ... గత రబీ సీజన్ లో 90 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం రబీలో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయినట్లు తెలిపారు. 

అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వడంలో ట్రాన్స్పోర్ట్, మిల్లర్ల సమస్య ఉన్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన తర్వాత సరైన తేమ, తాలు చూసి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉందో కొనుగోలు కేంద్రంలోనే రైతుకు రశీదు ఇవ్వాలని అంతే తప్ప రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ మిల్లుకు వెళ్లారని ఆదేశించారు. మిల్లర్లు వారి మిల్లు వద్ద ఆగి ఉన్న లారీలను రావు ఉదయం లోగా దించుకొని లారీలను పంపించాలన్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వద్ద ఒక్కొక్కరి దగ్గర 50 లారీలు ఉండాల్సి ఉండగా సరిపడ లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతుందన్నారు. 

అదేవిధంగా వడ్లు మిల్లు వద్దకు వెళ్లిన తర్వాత  తరుగు తీయడానికి ఒప్పుకుంటేనే దించుకుంటామని రైతులకు ఇబ్బందులు పెట్టడంతో లారీలు సకాలంలో అన్లోడ్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు ట్రక్ షీట్ నమోదు అయిన దానికి పొంతన లేదని స్పష్టం చేశారు. వరి కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమైన సమీక్ష సమావేశానికి ఐ. కె.పి, నిర్వాహకులు, పి. ఏ.సి.ఎస్  నిర్వాహకులు, ఏ. ఈ ఒ లు, కాంట్రాక్టర్లు అందరూ రాకుండా కొందరే రావడం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షా కాలం వచ్చేస్తుందని రైతులు కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో తడిచి నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి..  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి 

గత సంవత్సరం రబీ సీజన్ లో కొన్న ధాన్యం కంటే ఈసారి రెండు మూడింతలు ఎక్కువ ధాన్యం కొన్నప్పటికి  ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అని అందుకు కారణం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం లారీలు పెట్టకపోవడమే అని అదే విధంగా మిల్లర్లు తరుగు పేరుతో వడ్లు దించుకోకపోవడమే అని మండిపడ్డారు. 

రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు... వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి 

కొంతమంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని ఇది మంచి పద్దతి కాదని  వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు. ఏ రైతు కూడా పొట్టు అమ్ముకొని బతకాలని కోరుకోరని అందువల్ల రైతులకు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.  రైతు ఎట్టి పరిస్థితుల్లో మిల్లుకు వెళ్ళవద్దని కొనుగోలు కేంద్రంలోనే రసీదు తీసుకోవాలని సూచించారు.  రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. 

రైతులకు న్యాయం చేసేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం.. దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి 

వరి కొనుగోలు సజావుగా జరిగి రైతులకు న్యాయం చేసేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.  కొంతమంది మిల్లర్లు మాత్రమే తరుగు పేరుతో ధాన్యం త్వరగా దించుకోవడం లేదని ఇది మంచి పద్దతి కాదని సూచించారు. 

మరో 8 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుంది.. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

ఇప్పటి వరకు జిల్లాలో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.  కొనుగోలు చేసిన వడ్లకు రూ. 274 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.  మరో 80 నుంచి లక్ష టన్నుల వడ్లు మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారి సహకారంతో 500 లారీలు ధాన్యం సరఫరాకు పెట్టుకోవడం జరిగిందని, రాబోయే 8 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ట్రాన్స్పోర్ట్, మిల్లర్ల సమస్య పై అధికారులు దృష్టి సారించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ..

అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై కూడా సమీక్ష నిర్వహిస్తూ మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా 1208 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 116 ఇళ్ళు బేస్మెంట్ వరకు పూర్తి చేయడం వల్ల వాటికి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో నియోజకవర్గానికి 3500 ప్రకారం జిల్లాలో 5825  ఇళ్ళు కట్టడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు.  రెండవ విడతలో గ్రామస్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు.  పరిశీలన పూర్తి అయ్యాక ఇంచార్జి మంత్రి ఆమోదం పొందినవి గ్రామ సభలో ప్రచారం చేసి లబ్ధిదారులను  ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

అనంతరం రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో రాజీవ్ యువ వికాసం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో డి.సి. సి బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం , మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమోదిని, మాదాపూర్, కొత్తకోట మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్ లు, డీఆర్డిఒ ఉమాదేవి, హౌసింగ్ పి.డి పర్వతాలు,  తహసిల్దార్, ఎంపీడీఓ లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.