25-10-2025 11:47:43 PM
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి
ప్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీస్లను నిషేధించాలి
కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికరం
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
బస్సు ప్రమాద బాధితులకు కొవ్వొత్తులు వెలిగించి ఆప్ శ్రేణుల నివాళులు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ట్రావెల్ మాఫియాను ప్రభుత్వమే ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించి కర్నూల్ బస్సు ప్రమాద బాధితులకు కొవ్వొత్తులు వెలిగించి ఆప్ శ్రేణులు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల టూరిస్ట్ పర్మిట్ రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను రెగ్యులర్ గా నడిపేందుకు రాష్ట్ర రవాణా శాఖ ఎందుకు అనుమతిస్తున్నారని అయన ప్రశ్నించారు. రవాణా శాఖ అండదండలతోనే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు పన్ను ఎగవేత లేదా లాభాల కోసం ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలకు అలవాటుపడి హైదరాబాద్ నుండి బయలుదేరే ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాల అమలుపై పర్యవేక్షణ రవాణా శాఖ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఇందుకు కారణమైన వారితో పాటు వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని, బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ప్రవేట్ ట్రావెల్ బస్సు సర్వీస్ లను నిషేదించాలని రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులూ బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, హేమ జిల్లోజు జావీద్ షరీఫ్, దర్శనం రమేష్, రమ్య గౌడ్, రాకేష్ సింగ్, అలీ తదితరులు పాల్గొన్నారు.