14-03-2025 12:53:47 AM
తిమ్మాపూర్,మార్చి13(విజయక్రాంతి): ట్రాఫిక్ పార్కు సందర్శించడం ద్వారా పిల్లలకు అవగాహనతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో గల పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును గురువారం సందర్శించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ పట్ల పిల్లలకు అవగాహన కలిగించే అన్ని రకాల బోర్డులు, గుర్తులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు.
నమూనా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించే బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ట్రాఫిక్ పార్కు సందర్శించేలా చూడాలని తెలిపారు. పార్కు సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులను పలకరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, డిటివో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవిఐ రవికుమార్, తహసిల్దార్ విజయ్, ఎంపీడీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.